మళ్లీ నష్టాల్లోకి జారిన సూచీలు!

by Disha Web Desk 17 |
మళ్లీ నష్టాల్లోకి జారిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు ఒక రోజుకే పరిమితమయ్యాయి. గతవారం నష్టాల నుంచి సోమవారం ట్రేడింగ్‌లో కోలుకుంటున్నట్టు సంకేతాలిచ్చిన సూచీలు మళ్లీ పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో పాటు అనేక దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్ల పెంపు కొనసాగవచ్చని నిపుణుల వ్యాఖ్యలతో స్టాక్ మార్కెట్లు ప్రభావితమయ్యాయి. దీనికితోడు మాంద్యం భయాలు పెరుగుతుండటం, దేశీయంగా విదేశీ మదుపర్లు అమ్మకాలను కొనసాగించడం వంటి పరిణామాలు మంగళవారం ట్రేడింగ్‌లో నష్టాలకు కారణాలుగా నిలిచాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 631.83 పాయింట్లు కుదేలై 60,115 వద్ద, నిఫ్టీ 187.05 పాయింట్లు నష్టపోయి 17,914 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో రంగం మాత్రమే పుంజుకోగా, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్ అత్యధికంగా 6 శాతం కంటే ఎక్కువ ర్యాలీ చేసింది. పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, హిందూస్తాన్ యూనిలీవర్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.

భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అల్ట్రా సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, రిలయన్స్, ఐటీసీ, టెక్ మహీంద్రా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 60 పైసలు బలపడి రూ. 81.77 వద్ద ఉంది.

READ MORE

లేటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్లోకి ఏథర్‌ ఎలక్ట్రిక్ బైక్స్.. మొదటి 1000 మందికి బై బ్యాక్‌ ఆఫర్‌



Next Story

Most Viewed